Thursday, November 17, 2011

ఆచారాల్లోకి చొరబడుతూ - ఆంధ్ర జ్యోతి కథనం - 4 ప్రచారాలు, ప్రలోభాలు, విద్య, వైద్యం పేరిట మత మార్పిడిని ప్రోత్సహిస్తున్న క్రైస్తవ మిషనరీలు


హైదరాబాద్, నవంబర్ 12 : తాయెత్తులు, మొక్కులు, కొబ్బరి కాయలు, తలనీలాలు... ఇవి హిందువులకే పరిమితమనుకుంటే పొరపాటు పడినట్లే! క్రైస్తవంలోకీ ఈ సంప్రదాయాలు వచ్చాయి. ప్రచారాలు, ప్రలోభాలు, విద్య, వైద్యం పేరిట మత మార్పిడిని ప్రోత్సహిస్తున్న క్రైస్తవ మిషనరీలు.. హిందువులను తమ వైపు ఆకర్షించేందుకు హైందవ సంస్కృతినీ తమలో మిళితం చేసుకుంటున్న తీరిది. హైందవ దేవాలయాల్లో తీర్థ ప్రసాదాలు ఇవ్వడం సరికాదని చెప్పే క్రైస్తవ సంస్థలు.. హిందూ మతంలో అనాదిగా వస్తున్న ఆచారాలైన తలనీలాలు సమర్పించుకోవడం, కొబ్బరి కాయలు కొట్టడం, అగరబత్తులు వెలిగించడం వంటి వాటిని తమ మతంలోనూ ప్రవేశపెట్టాయి.

ఏసు మహిమలను కీర్తిస్తూ.. సంకీర్తనలు రూపొందించడం, పద్యాలను కూర్చడం కూడా చేస్తున్నాయి. త్యాగరాజ కృతులను పోలిన ఏసు సంకీర్తనలను కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రూపొందించారు. ఇలా భారతీయ సాహిత్య రూపాల్లోనూ క్రైస్తవ సాహిత్యాన్ని తయారు చేస్తున్నారు. తైలాభిషేకాలు, హారతులు వంటి పద్ధతులనూ క్రైస్తవ మిషనరీలు చర్చిలలో ప్రవేశ పెట్టాయి. 'క్రిస్టియన్ యోగా' అనే కొత్త పద్ధతికి కూడా క్రైస్తవ సంస్థలు రూపకల్పన చేశాయి.

అంటే.. క్రైస్తవాన్ని 'భారతీకరణ' (ఇండియనైజేషన్) చేస్తున్నాయన్న మాట. తద్వారా మతం మారాలనుకొనే హిందువులకు.. క్రైస్తవంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సంప్రదాయబద్ధమైన మార్పులను చేస్తున్నారు. హిందువులకు సాంస్కృతికంగానూ దగ్గరయ్యే ప్రక్రియలో భాగంగానే ఇదంతా జరుగుతోంది.

గతంలో వాటికన్‌లో భరతనాట్య ప్రక్రియలో క్రీస్తు జీవిత విశేషాలను ప్రదర్శించారు. క్రైస్తవంలోనూ తైలాభిషేకాలు జరుగుతాయి. మంత్రించిన కొబ్బరి నూనె చల్లినా, సేవించినా స్వస్థత చేకూరుతుందంటూ ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా గుత్తిలో తరచూ స్వస్థత మహా సభలు జరుగుతాయి. ఈ సభలకు ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున జనం వస్తారు. ఇక్కడ ఇచ్చే నూనెను సేవిస్తే 'ఆరోగ్యం గ్యారెంటీ' అనే ప్రచారమే ఇందుకు తార్కాణం.

మతం మారినా మారని కులం
అంతేకాదు.. కుల వ్యవస్థ అన్నది హిందూ మతానికే ప్రత్యేకం. కానీ.. మన దేశంలోని క్రైస్తవంలోనూ కుల వ్యవస్థ ప్రవేశించింది. హిందూ మతాన్ని వీడి.. క్రైస్తవ మతాన్ని తీసుకున్న వివిధ కులాల వారు తమ కుల వ్యవస్థను యథాతథంగా కొనసాగిస్తారు. తమ కులం వారినే పెళ్లి చేసుకుంటారు. కులాచారాలనూ తు.చ. తప్పకుండా పాటిస్తారు. హైందవం నుంచి క్రైస్తవంలోకి చేరిన వారిలో చాలామంది కుల చిహ్నాన్ని సూచించే పదాలను యథాతథంగా కొనసాగిస్తారు.

అగ్ర కులం వారికి.. తక్కువ కులం వారికీ మధ్య అంతరం అలానే కొనసాగుతుంది. కొన్ని చోట్ల.. అగ్రకులాల వారికి వేరుగా, నిమ్న కులం వారికి వేరుగా చర్చిలు వెలవడమే ఇందుకు నిదర్శనం. అంటే... ఒక కులం చర్చికి మరొక కులం వారు వెళ్లరన్న మాట! కాగా.. మతమార్పిడి గురించి 'ఆంధ్రజ్యోతి' ప్రచురిస్తున్న కథనాలకు రాష్ట్ర నలుమూలల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.

'ఆంధ్రజ్యోతి' కేంద్ర కార్యాలయానికి పాఠకులు పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తూ.. మత మార్పిడులపై తమకు తారసపడ్డ అనుభవాలను వివరిస్తున్నారు. కొందరైతే.. క్రైస్తవ మిషనరీల ప్రచారాన్ని నమ్మి.. అనారోగ్య కారాణాలు ఇతరత్రా కారణాల వల్ల తాము మతం మారామని అంగీకరిస్తున్నారు. వీరిలో కొందరు క్రైస్తవంలో తాము ఇమడలేక.. తిరిగి హిందూ మతంలోకి వచ్చేశామనీ చెబుతున్నారు.

ధనం మూలం..
మత విస్తరణ కాంక్షతో మార్పిడిని ప్రోత్సహించే వారు కొందరు! కేవలం... ధనకాంక్ష తో టార్గెట్లు పెట్టుకుని మరీ మతం మార్పించే వారు ఇంకొందరు! ఈ వ్యవహారం డబ్బు చుట్టూ తిరుగుతోందని బలమైన ఆరోపణలు ఉన్నాయి. ప్రతి మిషనరీ, దాని అనుబంధ సంస్థలు ఎంతమందిని మతం మార్పించిందీ అంతర్జాతీయ సంస్థలకు ప్రతి నెలా నివేదిక లు పంపుతాయి. వాటి ఆధారంగానే నిధులు అందుతాయి. ఒక్కో మత మార్పిడికి ఇంత సొమ్మని చర్చి ఫాదర్లు, పాస్టర్లకు ఇస్తారని చెబుతారు.

ప్రార్థనా మందిరాల నిర్మాణం పేరిట భారీగా నిధులు సేకరిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సైకిళ్లపై తిరుగుతూ మత ప్రచారం చేసిన కొందరు పాస్టర్లు ఇప్పుడు విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క కుటుంబాన్ని మతం మార్పిస్తే రూ.10 వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. పేదల సంక్షేమం నిధులు ఖర్చు చేస్తున్నామని అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీలకు తప్పుడు సమాచారం పంపి, డబ్బులు వెనకేసుకునే వారూ ఉన్నారు.

గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో 75 శాతం చర్చిలు విదేశీ నిధులతోనే నడుస్తున్నాయి. అన్యమతస్తులకు బాప్టిజం ఇప్పించినట్లుగా ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌లు పంపిస్తూ నిధులు సేకరిస్తున్నారు. నిజాయితీగా మతం కోసం మాత్రమే పని చేస్తూ, స్థానిక విరాళాలు, చందాలతో జీవించే వారూ ఉన్నారు. 1989లో ఉన్న అధికారిక సమాచారం ప్రకారమే... ప్రపంచ వ్యాప్తంగా చర్చిలు 14,500 కోట్ల డాలర్లు ఖర్చు పెడుతున్నాయి.

లెక్కకు చిక్కరు..
'రాష్ట్రంలో ఎంతమంది మతం మార్చుకుంటున్నారో అధికారిక లెక్కలు లేవు. ఎందుకంటే.. అలాంటివి నమోదు చేయాలన్న నిబంధన లేదుగనుక. కేరళ, తమిళనాడు తదిత ర రాష్ట్రాల్లో బాప్టిజం పొందాలంటే రెవెన్యూ అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దళితులు క్రైస్తవంలోకి మారితే సామాజిక హోదా ఎస్సీ నుంచి బీసీలుగా మారి, రిజర్వేషన్లపరంగా నష్టపోతారు. దీంతో మతం మారినా వారు ఎస్సీలుగానే కొనసాగుతున్నారు. దీనివల్ల అసలైన ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని ఈ వర్గాలు వాపోతున్నాయి.

చావు.. పుట్టుక!
రాజమణికి 80 ఏళ్లు. హైదరాబాద్ సమీపంలోని రామవరం అనే కుగ్రామం. కార్తీక మాసంలో ఆమె శివాలయాల చుట్టూ తిరిగేవారు. రోజంతా పూజలతో గడిచిపోయేది. 9 నెలల క్రితం ఆమె మతం మార్చుకున్నారు. పూజలు మానేసి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారు. 'మతం ఎందుకు మార్చుకున్నారు?' అని అడిగితే... 'చనిపోయాక కర్మ కాం డల అవసరం ఉండదని చర్చి అధికారులు చెప్పారు. కుటుంబానికి ఎలాంటి ఖర్చూ ఉం డదన్నారు. అందుకే మారాను' అని తెలిపారు.

కుటుంబ సభ్యులకు ఇదంతా ఇష్టం లేదు. సుమారు రెండు వారాల క్రితం ఆమె మరణించారు. ఆమెకు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తామంటూ చర్చి అధికారులు వచ్చారు. దీనిపై కుటుం బసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినా చివరకు... క్రైస్తవం ప్రకారమే ఆ పని కానిచ్చేశా రు. మత మార్పిడితో కుటుంబ స్థాయిలో సంఘర్షణకు ఇదో ఉదాహరణ!

మళ్లీ మారాం..
'ఆంధ్రజ్యోతి' కథనాలపై పాఠకులు పెద్దసంఖ్యలో ఫోన్లు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐకపాముల గ్రామవాసులు ఐదుగురు శనివారం 'ఆంధ్రజ్యోతి'కి చెప్పిన విషయమిది... "ఏసయ్య ధనం ఇస్తాడు. పాపాలన్నీ రక్తంతో శుద్ధి చేస్తాడు. ఉబ్బసం వంటి మొండి వ్యాధులను కూడా తగ్గిస్తాడు. పరలోక ప్రయాణానికి ఆటంకాలు లేకుండా ఆశీర్వదిస్తాడు... అని చర్చిలో చెప్పేవారు. మమ్మల్ని గుడికి వెళ్లొద్దని చెప్పేవారు. బంధువులెవరైనా చనిపోతే ముట్టుకోకూడదనేవారు. మా భార్యలను గాజులు తీసెయ్యమన్నారు. బొట్టుపెట్టుకోద్దన్నారు. దీంతో మేం చర్చికి వెళ్లడం మానేసి, మళ్లీ హిందూ మతంలోకి వచ్చేశాం! ఇలాంటి 20 కుటుంబాలు గ్రామంలో ఉన్నాయి.''

మంత్రం తంత్రం...
తాయెత్తులు, మొక్కులు, కొబ్బరి కాయలు, తలనీలాలు... ఇవి హిందువులకే పరిమితమనుకుంటే పొరపాటు పడినట్లే! క్రైస్తవంలోకీ ఈ సంప్రదాయాలు వచ్చాయి. లేదా... తీసుకొచ్చారు. క్రైస్తవంలో హైందవంలో ఉన్నన్ని పూజలు, పునస్కారాలు లేవు. కానీ, మతం మారిన, మారాలనుకున్న వారికి ఇబ్బంది లేకుండా సంప్రదాయబద్ధమైన మార్పులను చేర్చినట్లు తెలుస్తోంది. గతంలో వాటికన్‌లో భరతనాట్య ప్రక్రియలో క్రీస్తు జీవిత విశేషాలను ప్రదర్శించారు.

ఇటీవలి కాలంలో 'క్రిస్టియన్ యోగా' ప్రచారంలోకి వస్తోంది. క్రైస్తవంలోనూ తైలాభిషేకాలు జరుగుతాయి. మంత్రించిన కొబ్బరి నూనె చల్లినా, సేవించినా స్వస్థత చేకూరుతుందంటూ ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా గుత్తిలో తరచూ స్వస్థత మహా సభలు జరుగుతాయి. ఈ సభలకు ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున జనం వస్తారు. ఇక్కడ ఇచ్చే నూనెను సేవిస్తే 'ఆరోగ్యం గ్యారెంటీ' అనే ప్రచారమే దీనికి కారణం. 
Courtesy : Andhra Jyothy

1 comment: