Saturday, November 19, 2011

హిందువులను అణగదొక్కేందుకే మత బిల్లు - సత్యపదానంద స్వామి ఆగ్రహం




హైదరాబాద్, నవంబర్ 17: హిందువులను అణగదొక్కేందుకే మత హింస నిరోధక బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని సాయిధామం పీఠాధిపతి సత్యపదానంద ప్రభుజీ మహారాజ్, మాతా నిర్మలానంద యోగ భారతి, సత్యానంద భారతి స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మత హింస బిల్లు పార్లమెంటులో చర్చకు రాకుండానే అడ్డుకోవాలని వారు పిలుపునిచ్చారు. విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, నగర అధ్యక్షుడు నోముల వినోద్‌లతో కలిసి వారు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇప్పటికే తాము 12 మంది రాష్ట్ర ఎంపిలను కలిసి మత బిల్లు ముప్పును వివరించామని, మిగిలిన వారినీ కలిసి ఈ అంశాన్ని వివరిస్తామని చెప్పారు.

మత బిల్లుకు వ్యతిరేకంగా సాధు సంత్‌లతో పెద్ద ఉద్యమానే్న చేపడతామని వెల్లడించారు. రామజన్మభూమి ఉద్యమం మాదిరి మత హింస నిరోధక బిల్లుకు వ్యతిరేకంగా తాము ఉద్యమిస్తామని తెలిపారు. దేశంలో హిందువులపై దాడులు పేట్రేగిపోయాయని, హిందూ సమాజాన్ని అణగదొక్కేందుకు అన్ని శక్తులూ ప్రయత్నిస్తున్నాయని అన్నారు. దేశంలో మత మార్పిడులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం మత మార్పిడులపై చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని, దీనిని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యతిరేకించే వారిపైనా దాడులు జరుపుతున్నారని, అరెస్టులు చేస్తున్నారని, హింసకు గురిచేస్తున్నారని వారు చెప్పారు.

గోహత్య బిల్లును తెచ్చిన ప్రభుత్వం దానిని అమలుచేయడం మరచిందని, పాలకులంతా గాంధీ వారసులుగా చెప్పుకుంటున్నారని, గాంధీ సైతం గోహత్యను నిషేధించాలని చెప్పారని, కాని నేటి పాలకులు గాంధీ పేరు చెప్పుకుని గోహత్యను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రోత్సహిస్తున్నారని అన్నారు. సోనియాకు గాంధీ పేరుచెప్పుకునే అర్హత లేదని అన్నారు. గోవులను కబేళాలకు తరలిస్తుంటే వాటిని అడ్డుకుంటున్న వారిని అరెస్టు చేస్తున్నారని, ఇదేమి న్యాయమని అన్నారు.

(చిత్రం: విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతున్న సాయిధామం
పీఠాధిపతి సత్యపదానందస్వామి, మాతా నిర్మలానంద భారతి)

http://www.andhrabhoomi.net/state/q-077

No comments:

Post a Comment